పడిలేచిన కడలి తరంగం
- “అభినవ మొల్ల” డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, భద్రాచలం
ఆమె జీవితం రాళ్ళలో చిలికిన సెలయేరు. దానిని పావన గోదావరిగా మార్చుకుందామె. ఆమె పడిలేచిన ఒక కడలి తరంగం! రాముడు వెలసిన భద్రాచలం రాజవీధిలో ఆమె అక్షర రాణి సౌరభ వాణి. బాధలను ధిక్కరించిన వెలుగు ఆమె కవిత్వం!
ఆమె “అభినవ మొల్ల” బిరుదాంకితురాలు డా. చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ. శ్రీ పొడిచేటి వీర రాఘవాచార్యులు, శ్రీమతి నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా 1939 జనవరి 3వ తేదీన ఆమె జన్మించింది. తండ్రిగారు ఆగమశాస్త్ర పండితులు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 60 సంవత్సారాలు ప్రధానార్చక పదవిలో సేవలందించిన మహనీయుడు. ఉదాత్త చరితుడు. అజాత శ్రతువు అంటారు అందరు. ఆరుగురు సోదరీమణులు, నలుగురు సోదరులకు ప్రేమ, ఆప్యాయతలు పంచి జీవితానుభవాల నిఘంటువులో ప్రేమ అనే రెండక్షరాలకు అర్థం ఆమె.
వారిది సనాతన కుటుంబం. 9 సంవత్సరాలకే వివాహం జరిపించారు. శారదా బిల్లు చట్టం ఉన్న ఆ సమయంలో ఆమె వివాహం రహస్యంగానే జరిగింది. అత్త, ఆడపడుచుల ఆరళ్ళతో అత్తవారింటి జీవితం ప్రారంభమైంది. చివరకు ఇంటిలో బావిలో త్రోసి వేశారు. వారికి పెద్ద వ్యవసాయం ఉంది. అందుకే పాలేర్లు ఉండేవారు. వారే ఆమెను రక్షించారు.
కట్టు బట్టలతో ఆమె పుట్టింట చేరింది. అల్లారు ముద్దుగా పెంచి తాతగారు ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు.
అత్తవారింటి ఆస్తిని ఆశించలేదు. స్వయంగా ఇంట్లో ఉండి ప్రైవేటుగా ఆంధ్రా మెట్రిక్ పాసైంది. ఎస్.జి.బి.టి. ట్రైనింగ్ పూర్తిచేసి భద్రాచలం మల్టీపర్పస్ హైస్కూలులో ఉపాధ్యాయ వృత్తి చేపట్టింది.
ఉద్యోగం చేస్తూనే పి.యు.సి., బి.ఏ, ఎం.ఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఉద్యోగ జీవితంలో అనేక విజయాలు సాధించింది. భాషా పండితురాలిగా విద్యార్థులకు జ్ఞానాన్ని పంచింది. విద్యార్థుల హృదయాల్లో సముచిత స్థానం సంపాదించుకుంది. ఓరియంటేషన్ ప్రోగ్రాంకు 1975 ప్రాంతంలో మైసూరు రీజనల్ కాలేజీకి వెళ్ళే అవకాశం లభించింది. వాచకాల సెలక్షన్ కమిటీకి ఎన్నికై, రెండుసార్లు పాల్గొనగలిగింది. ఆమె వృత్తిని దైవంగా భావించి విద్యార్థుల హృదయాలు గెలుచుకుంది.
ఆమె సాహిత్య జీవితం అద్భుతం! ఆమె 7 సంవత్సరాల వయసులో గాంధీ మహాత్ముని మరణవార్త విని స్పందించి “భారత జనకుడు ఇకలేదు, గాంధీ తాత ఇకలేడు” అంటూ అక్షర తర్పణంతో కవిత్వ రచన మొదలైంది. అప్పటి నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా సాహితీ జీవితం సాగిపోతున్నది. మొదట కథలతో ప్రారంభం చేసింది. ఒయాసిస్సులు, విధి బలీయం, పంట కళ్ళం మొదలైనవి పత్రికలు ప్రచురించాయి. ఒక పది సంవత్సరాలు పత్రికా రచనలు జరిగాయి. అలనాటి గోల్కొండ పత్రిక, కృష్ణా పత్రిక, ప్రజామత, మనదేశం, తెలుగు తేజం, ఆంధ్రప్రభ, జ్యోతి, ఆంధ్రపత్రిక, వీక్లీ పత్రికలు అమితంగా ప్రోత్సహించాయి. 1981లో ఆమె కావ్య రచన ప్రారంభమైంది. 1964 సంవత్సరంలో భద్రగిరి అనే నవల వ్రాసింది. మహాకవి దాశరథి దానికి పీఠిక వ్రాశారు. 1981లో ‘రామదాసు’ పద్య కావ్యం వ్రాశారు. కరుణశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు “అభినవ మొల్ల” బిరుదు ప్రసాదించారు. మహాకవి పధునా పంతుల సత్యనారాయణ శాస్త్రిగారు బలపరిచారు. అప్పటి నుండి ఆమె వెనుతిరుగలేదు. “ఆంధ్రదేశమంతట ఒక్క ‘రామదాసు’ కావ్యమే కీర్తి తెచ్చిపెట్టింది. లబ్ధ ప్రతిష్ఠులైన కవుల ప్రశంసలు, ఆశీస్సులు లభించ మత సామరస్యానికి ప్రతీకగా ‘రామదాసు’ నీరాజనాలందుకుంది. తరువాత కవితా ధనుస్సు కవితా సంపుటి వెలుగు చూసింది.
“ఆమె కాదు కేవలం ఒక భామ! ఆమె ఈ యుగం సత్యభామ. లేవామెకు లుకులు లావామెకు అలకలు, లేవామెకు సపత్నిమత్సరాలు, లేనేలేవామెకు కోప గృహాలు, లేవామెకు పారిజాతాపహరణమ్ములు, లేవామెకు తులాభారమ్ములు, లేనేలేవామెకు విరహ విలాపమ్ములు, కాని ఆమె ధరించిందొక కవితా ధనుస్సు, చీల్చి వేస్తున్నది అజ్ఞాన నరకుని శిరస్సు, జీవన విషాద తమస్సు” అంటూ ఆత్మాశ్రయ కవిత్వంతో సామాజిక రుగ్మతలపై కవితా ధనుస్సు ఎక్కుపెట్టింది.
తరువాత ‘శాంతిభిక్ష’ కవితా సంపుటి అనేక సామాజిక అంశాలను పద్యాలు, వచన కవితలు వివిధ పత్రికలలో వచ్చినవి చోటు చేసుకున్నాయి.
“భద్రగిధామ, రఘోత్తమ శ్రీ మనోహరా!” అనే మకుటంతో సమతాభిరామం పేరుతో శతకం వెలుగు చూసింది.
ప్రకృతిలో ఋషులు చూచిన భగవంతుని ఇందులో ఆవిష్కరించడమేకాక ఎంతో ఉపదేశం కూడా ఉంది. “గుడిగుడి యంచు మానవులు ఘోర కలిన్ సృజియింతురేల? గుండె గుడిగట్టి నినున్ గోలువంగ రాదె”
“మతములనేకమైన మనలో భగవంతుడొకండె”
“మమతల మందిరమ్మునకు మానసవాసుకి గట్టి జీవన
భ్రమయను దుగ్దవార్థి మధియించుచునున్న ప్రాణిజా
లములకో సంగెదేల గరళమ్ము సుధార సమీయరా! మహ
త్కమ శరీర!” అంటూ ఎన్నో సామాజికాంశాలతో ఆ శతక రచన సాగింది.
కావ్య గౌతమిలో 11 కావ్యాలు ప్రచురించింది.
అందులో ‘నీరాజనం’ స్త్రీల సమస్యలను ప్రస్తావించారు.
అత్యాచారాలకు బలైపోయిన స్త్రీల గురించి పద్యాలు, వచన కవితలు, వీర జవానుల త్యాగాలు “విరాజనం” కవితా సంపుటిలో ఉన్నాయి. ఇదివరలో విజయవాడ ఆకాశవాణి నుండి ప్రసారమైన సమస్యాపూరణలు, అవధానాలలో అడిగిన సమస్యలు పూరణలు కూడా ఉన్నాయి. “మధువని” చిన్ని పుస్తకంలో లలితగీతాలు ఉన్నాయి. తండ్రిగారు పరమపదించినపుడు “అక్షర తర్పణం” కావ్యం రాసి కూతురుగా రుణం తీర్చుకుంది. భద్రాచల క్షేత్ర మహత్యాన్ని హరికథగా, పద్య నాటకంగా వచన గ్రంథంగా, పద్యంగా, నవలగా వివిధ ప్రక్రియలలో రచించి లోకానికి అనేక విషయాలు తెలుపగలిగింది. శ్రీ పదం - తమిళ ప్రబంధాల అనువాదం. “దివ్య గీతాంజలి” – “తిరువాయ్ మొళి” దివ్య ప్రబంధానికి వచన కవితలో స్వేచ్ఛానువాదం. ఒక జీవనాయిక పరమాత్ముని చేరడానికి పడే తపన హృద్యంగా రచించింది. “ఆడించేదీ నీవే, ఆడుకునేదీ నీవే, పగులగొట్టేదీ నీవే, మళ్ళీ అతికించేదీ నీవే, కరుణతత్వంగా మారింది. అదే నిన్ను లోక రక్షకుని చేసింది. విశ్వ భావనతో విశ్వాత్మునికి అంకితమైపోయాను” అంటూ దేవునికీ, జీవునికీ విశిష్ట అభేదాన్ని ప్రతిపాదించింది. తేట తెలుగు భాష, పొందికైన పదాల కూర్పు, పద్యమైనా, గద్యమైనా, గేయమైనా, కథైనా, నాటకమైనా, వ్యాసమైనా ఏది రాసినా సరళ సుందరంగా, ఆర్తితో హృదయాన్ని స్పందింపచేసే అరుదైన కవయిత్రి, అభినవమొల్ల! అన్నారు బేదవోలు రామబ్రహ్మంగారు. ఆంధ్రజ్యోతి పద్యారామంలో కీ.శే. చేకూరి రామారావుగారు రెండు వారాలు “చేరాతలు”లో ఈమె కవిత్వాన్ని ప్రశంసించారు.
ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నుండి ఎన్నెన్నో సాహితీ ప్రక్రియలు ప్రసారమైనాయి. 22 పద్య, గద్య కావ్యాలు భాషా ప్రియులను, పాఠకులను అలరించాయి. ఇటీవల ఆచార్య ఎన్. గోపి గారి ప్రేరణతో “భద్రగిరి నానీలు” రచించారు. గోపీగారు అచ్చులోకి తెచ్చారు. అంత స్వాభావికంగా, నిజాయితీగా, ఉపదేశకంఠంగా కవితాత్మకంగా ఉన్నాయి.
“ఉన్నోళ్ళ విందుల్లో
నీళ్ళన్నీ సెలయేళ్ళు
లేనోళ్ళకు కన్నీళ్ళే మంచి నీళ్ళు”
“దేశంలో శాంతి భద్రతల లోపం
కలకంఠుల కన్నీటి శాపం”
“మానవులను దానవులన్నారని
దానవులంతా దాడి కొస్తున్నారు”
“నూరు యజ్ఞాలు చేసినా ఇంద్ర పదవే
చెట్టునాటి చూడు మోక్షం లభిస్తుంది”
“నా అక్షరాలు కావు కుక్షింభరాలు
విశ్వ శ్రేయానికి మంగళ తోరణాలు”
ఇలా నూటికి పైన సాగాయి భద్రగిరి నానీలు.
తనకు ఇష్టమైన ప్రాచీన కవి పోతన. ఆధునికులలో కరుణశ్రీ అంటుందామె. ఇంకా ఎందరో ఆధునిక కవీశ్వరుల ప్రేరణ లభించింది. అవార్డులు, పురస్కారాలు బాధ్యతను పెంచడానికి అని ఆమె భావన. 70 సంవత్సరాల సాహితీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి. చివరి దశలో తండ్రికి దూరమైన తన మేనకోడలి కుమారుణ్ణి దత్తత తీసుకొన్నది. చిన్నజీయరు స్వామివారి ముచ్చింతల్ జీవా గురుకులంలో 7 సంవత్సరాలుగా వేదాభ్యాసం చేస్తున్నాడు. రాముణ్ణి ప్రాణంగా కొలిచే ఆ బాలుడు “రఘుపుంగలె” అన్ని విధాలా ఆమెకు తగిన పుత్రునిగా సంస్కృతాంధ్ర, దివ్వ ప్రబంధ వేద విద్యల్లో ఆరితేరుతున్నాడు. కవిత్వము, రఘు పుంగవ తన రెండు కళ్ళు. 76 సంవత్సరాల తన ఆరోగ్యానికి కవిత్వమే దివ్యామృతం అంటుంది. “రామాయణం” రాయాలని ఆమె చివరి కోరిక. ఎంత రాసినా ఆమె గురించి ఇంకా మిగిలే ఉంటుంది.
కవయిత్రి అభినవ మొల్ల డా. చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ గురించి
ముద్రిత రచనలు
1. భద్రగిరి (నవల)
2. రామదాసు (పద్యకావ్యం) ఎం.ఫిల్ పరిశోధన, మధురై కామరాజ్ యూనివర్సటీ నుండి
3. కవితా ధనుస్సు (ఖండకావ్యం)
4. సమతాభిరామం (భద్రగిరిధామ శతకం)
5. శాంతిభిక్ష (ఖండకావ్యం)
6. శ్రీపదం (ద్రవిడ ప్రబంధానువాద పద్యకావ్యం)
7. అక్షరతర్పణం (స్మృతి కావ్యం)
8. మారుతీ సుప్రభాతం
9. భద్రాచల యోగానంద లక్ష్మీనృసింహ సుప్రభాతం
10. నీరాజనం (పద్య కవితా సంపుటి)
11. సమస్యా పూరణ
12. మధువని
13. కావ్య గౌతమి
14. స్వరార్చన
15. గోదా కళ్యాణం, ఎం.ఫిల్ పరిశోధన, కాకతీయ యూనివర్సిటీ నుండి.
16. భద్రాచల క్షేత్ర చరిత్ర (నాటకం) రేడియో ప్రసారం
17. తానీషా (నాటకం) రేడియో సప్తాహంలో
18. భద్రాచల క్షేత్ర మహత్యము
19. మాతృభూమి
20. దివ్య గీతాంజలి
21. తులసీదళాలు (భక్తి గీతాలు)
22. భద్రగిరి నానీలు
పురస్కారాలు
1. యునెస్కో సాహితీ స్వర్ణ మహిళ - 1998
2. యునెస్కో లిటరసీ ఉమన్ ఆఫ్ ద ఇయర్ - 1998
3. భీమవరం వారి ఆధ్యాత్మిక పురస్కారం - 2000
4. భద్రాచలం వాసవీ క్లబ్ వారి సేవా పురస్కారం (భద్రాచలం) - 2002
5. సత్తుపల్లి బ్రాహ్మణ సంఘం వారి ఉగాది పురస్కారం - 2004
6. సాయినాథ బదరికాశ్రమ పురస్కారం (జూకల్లు గ్రామం)
7. సాహితీ తెలుగు మహిళా పురస్కారం (భద్రాచలం) - 2002
8. భద్రాద్రి ఉత్సవాల సాకేతపురి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం - 2002
9. అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారం - 2004 (ఖమ్మం)
10.
...
[Message clipped] View entire message
Attachments area
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి